
టీపీబీవోకు కేటాయించిన డిజిటల్ ఐడీని, అధికారిక లాగిన్ను కూడా ఏసీపీ శ్రీధర్ గుప్పిట్లోనే
రూ.కోట్లలో డిజిటల్ సంతకాల దందా.విజిలెన్స్ విచారణకు చేపట్టాలని స్థానికులు డిమాండ్
విజేత,రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగం ఏసీపీ శ్రీధర్ సొంత జాగీరుగా మారిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను కాగితాలకే పరిమితం చేస్తూ, అధికారుల హక్కులను కాలరాస్తూ తన అక్రమ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారనే విమర్శలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (టీపీబీవో)గా విశాల్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ఆయనను కేవలం ఒక ‘ఉత్సవ విగ్రహం’గా మాత్రమే మిగిల్చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కార్యాలయ వ్యవహారాలు, నిర్ణయాలు, అనుమతులు మాత్రమే కాకుండా, చివరకు టీపీబీవోకు కేటాయించిన డిజిటల్ ఐడీని, అధికారిక లాగిన్ను కూడా ఏసీపీ శ్రీధర్ స్వయంగా తన గుప్పిట్లోనే ఉంచుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
లాగిన్ ‘హైజాక్’.. నిబంధనలకు పాతర
పాలనా సౌలభ్యం, పారదర్శకత కోసం ప్రభుత్వం కేటాయించిన అత్యంత కీలకమైన టీపీబీవో అధికారిక డిజిటల్ లాగిన్ ఐడీలు, డిజిటల్ సంతకాలను ఇతరులు లేదా ఉన్నతాధికారులు స్వయంగా వాడడం తీవ్రస్థాయి నిబంధనల ఉల్లంఘనే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్రమ అనుమతులు, అక్రమ నిర్మాణాలకు అడ్డదారిన ఊపిరి పోసేందుకే ఏసీపీ ఈ రకమైన ‘హైజాక్’ పర్వానికి తెరలేపారని స్థానికులు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
విజిలెన్స్ విచారణ జరిపితేనే అసలు రంగు బయటపడుతుంది
ఈ విభాగంలో జరుగుతున్న ‘అక్రమ దందా’ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారులను తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, విజిలెన్స్ విభాగాలు తక్షణమే స్పందించి సాంకేతిక తనిఖీలు చేపడితే ఏసీపీ శ్రీధర్ అక్రమాల లీలలు, అధికార దుర్వినియోగం వెలుగులోకి వస్తాయని డిమాండ్ చేస్తున్నారు. తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఏసీపీ శ్రీధర్పై శాఖాపరమైన విచారణ జరిపి సస్పెండ్ చేయడంతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




