
విజేత,రాయికల్ : హరేకృష్ణ, హరేకృష్ణ, కృష్ణ కృష్ణ! హరేహరే హరేరామ,హరేరామ, రామ రామ హరేహరే! కీర్తనతో భక్తుల జయజయ ధ్వనాలతో జగన్నాథుని రథయాత్ర ను ఇస్కాన్ ఆధ్వర్యంలో రాయికల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం రోజున రాయికల్ పట్టణ కేంద్రంలో జగన్నాథస్వామి బలదేవ,సుభద్ర దేవిల జగన్నాథ రథయాత్రలో పట్టణ, మండల నలుమూలల నుంచి వచ్చిన భక్తులు పాల్గొని జై జగన్నాథ! హరేకృష్ణ హరేకృష్ణ,కృష్ణ కృష్ణ హరేహరే! గోవింద నామాలను స్మరిస్తూ భక్తి పారవశ్యంతో, తన్మయత్వంతో బృందనాట్యాలు చేస్తూ రథాన్ని భక్తితో లాగుతూ శ్రీకృష్ణుడి కృపకు పాత్రులైనారు. ఈ రథయాత్ర స్థానిక బస్టాండ్ నుండి మెయిన్ రోడ్ మీదుగా గాంధీచౌక్, వల్లభాయ్ చౌరస్తా మార్కండేయమందిరం వరకు కొనసాగింది. ఈ రథయాత్రలో స్వామివారి ప్రసాదాన్ని భక్తులందరికీ నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ రథయాత్రతో శ్రీ జగన్నాథస్వామి ఆశీస్సులు రాయికల్ మండల ప్రజలందరిపై ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, సుఖశాంతులు సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




