
సీసీ కెమెరా డీవీఆర్ సహా రూ. 20 లక్షల సొత్తు అపహరణ
అమ్మవారి బంగారం, వెండి ఆభరణాలు, హుండీ ఊడ్చేసిన దుండగులు
ఆధారాలు దొరక్కుండా డీవీఆర్ సైతం మాయం
తెలిసిన వారి పనేనని గ్రామ ఆలయ కమిటీ అనుమానం..నార్సింగి పిఎస్లో ఫిర్యాదు
విజేత,రాజేంద్రనగర్ :పవిత్రమైన దేవుడి గుడి అని కూడా చూడకుండా, భక్తి భావాన్ని తుంగలో తొక్కి దొంగలు విరుచుకుపడ్డారు.గండిపేట్ మండలం ఖానాపూర్ గ్రామం లోని ప్రసిద్ధ శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో అర్ధరాత్రి దుండగులు సృష్టించిన బీభత్సం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునే భక్తుల నమ్మకాన్ని గాలికి వదిలేసి, ఆలయాన్ని గుల్ల చేశారు.పక్కా పథకం ప్రకారమే ఆలయంలోకి చొరబడిన దొంగలు.. ఆలయంలో ఉన్న హుండీని పగులగొట్టడమే కాకుండా, సాక్షాత్తూ అమ్మవారి ఒంటిపై ఉన్న విలువైన బంగారు, వెండి ఆభరణాలను, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా తమ ఆచూకీ ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆలయంలోని సీసీ కెమెరాలకు సంబంధించిన డీడీవీఆర్ ను సైతం వెంట తీసుకెళ్లడం వారి కిరాతకానికి, ముందస్తు ప్లాన్కు అద్దం పడుతోంది. ఈ దోపిడీలో సుమారు రూ. 20 లక్షలకు పైగా విలువైన ఆభరణాలు, స్వచ్ఛంద విరాళాల సొత్తు చోరీకి గురైనట్లు తెలుస్తోంది.ఆలయం లోపల ప్రవేశించిన తీరు, డీవీఆర్ ఎక్కడ ఉందో సరిగ్గా గుర్తించి పట్టుకెళ్లడం చూస్తుంటే.. ఈ ఘాతుకానికి పాల్పడింది ఆలయ పరిసరాలపై, రూట్ మ్యాప్పై పూర్తిగా అవగాహన ఉన్న స్థానికులు లేదా తెలిసిన వ్యక్తులే అయి ఉంటారని గ్రామ ఆలయ కమిటీ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తోంది.సంఘటనపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులకు ఆలయ నిర్వాహకులు వెంటనే ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేశారు. అమ్మవారి సొత్తును దోచుకెళ్లిన పాపాత్ములను వెంటనే తేల్చి, కఠినంగా శిక్షించాలని ఖానాపూర్ గ్రామస్థులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.





