
జలహారతికి వచ్చే నెల 14న పేటకు సీఎం రాక
విజేత, పాయకరావుపేట: వచ్చే నెల 14న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ కాలువ జలహారతి కార్యక్రమానికి పాయకరావుపేటకు విచ్చేయనున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు మంగళవారం దుర్గా కాలనీ సమీపంలోని పోలవరం ఎడమ కాలువ ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదలకు సీఎం చంద్రబాబు వచ్చే నెల 14న దుర్గ కాలనీ సమీపంలో తొలిసారిగా జలహారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లపై నాయకులు ప్రాజెక్ట్ ఇంజనీర్లు, ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల ఉత్తరాంధ్ర రైతులకు చారిత్రాత్మక ఘట్టమని నాయకులు పేర్కొన్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్,రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబు, నాటక అకాడమీ డైరెక్టర్ పల్ల విలియం కేరి,టీడీపీ మండల అధ్యక్షులు చించలపు ప్రదీప్, పట్టణ అధ్యక్షులు యాళ్ల వరహాల బాబు, పిఎసిఎస్ చైర్మన్లు చిక్కాల శ్రీను, దేవరపు రాజబాబు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంకిపాటి వెంకటేశ్వరావు, టీడీపీ మహిళా విభాగం కన్వీనర్ రమాకుమారి, ఎంపీటీసీ వేములపూడి అప్పారావు, బోడపాటి శ్రీను, జనసేన పట్టణ అధ్యక్షులు ఆచంట దొర, బీజేపీ పట్టణ అధ్యక్షులు పువ్వల కుమార్,స్థానిక ఇంచార్జ్ తహసిల్దార్ శాంతిభూషణ రావు, ఎంపీడీవో బి.శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.






