
విజేత,విజయవాడ ప్రతినిధి: అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రజారవాణా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారులు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వేను అధికారికంగా ప్రారంభించారు. భూసేకరణ వల్ల స్థానిక ప్రజలు, వ్యాపార సంస్థలపై పడే ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి, వారికి తగిన పరిహారం , పునరావాసం కల్పించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశం.దీనికి సంబంధించి త్వరలోనే ప్రభావిత ప్రాంతాల ప్రజలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు.విజయవాడ మెట్రో మొదటి విడత నిర్మాణంలో భాగంగా రెండు ప్రధాన కారిడార్లను ప్రతిపాదించారు. మొదటి కారిడార్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విస్తరించి ఉండగా.. రెండో కారిడార్ PNBS నుండి పెనమలూరు వరకు సాగనుంది. ఈ రెండింటికీ ప్రధాన రవాణా కేంద్రమైన పండిట్ నెహ్రు బస్ స్టుషన్ వద్దే రెండు ప్రత్యేక మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నగరం నడిబొడ్డున ఉన్న బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లతో పాటు గన్నవరం ఎయిర్పోర్టును మెట్రో ద్వారా అనుసంధానించడం వల్ల ప్రయాణికులకు సత్వర , సునాయాస రవాణా వసతి లభించనుంది.గతంలో నిలిచిపోయిన ఈ మెట్రో ప్రాజెక్ట్ను మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుండటంతో విజయవాడ , అమరావతి పరిసర ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్ట్కు అవసరమైన అనుమతులు, డిజైన్లు , భూసేకరణకు సంబంధించిన పనులు సమాంతరంగా జరుగుతుండటం ప్రాజెక్ట్ అమలుపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోంది. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ , ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన వెంటనే భూసేకరణ తుది ప్రక్రియ ప్రారంభమై, విజయవాడ మెట్రో నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభం కానున్నాయి.




