
విజేత (తాడేపల్లి గూడెం) పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలో వేడుకలు అంబరాన్నంటాయి. పార్టీ యువనేత బొలిశెట్టి రాజేష్ నాయకత్వంలో పట్టణంలో నిర్వహించిన భారీ ద్విచక్ర వాహన ర్యాలీకి జనసైనికులు కదం తొక్కారు. నియోజకవర్గంలోని నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ర్యాలీ మార్గమంతా జనసందోహంగా మారింది.
ఈ ర్యాలీ పెంటపాడు మండలం నుంచి ప్రారంభమై పట్టణంలోని ఛత్రపతి శివాజీ కూడలి వరకు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కూడా తమ తనయుడు రాజేష్తో కలిసి ద్విచక్ర వాహనంపై ర్యాలీలో పాల్గొని కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.

సామాజిక సేవా కార్యక్రమాలు:
ర్యాలీ అనంతరం ఛత్రపతి శివాజీ కూడలి వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. దేశ సేవలో భాగస్వాములైన మాజీ సైనికులను ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. అనంతరం నిరుపేద మహిళలకు వస్త్రాలు (చీరలు) పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, మండల అధ్యక్షుడు, సొసైటీ ఛైర్మన్ అడపా ప్రసాద్, పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్ల బాబి, పార్టీ నాయకులు చాపల రమేష్, నీలపాల దినేష్, ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు సభ్యురాలు కసిరెడ్డి మధులత మరియు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









