
విపక్ష నిరసనలతో చర్చ వాయిదా కఠిన శిక్షల ప్రతిపాదన
విజేత,న్యూఢిల్లీ ప్రతినిధి : పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పరీక్షల్లో అక్రమాల నిరోధక చట్ట సవరణ బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. అయితే నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ అంశాన్ని ప్రస్తావిస్తూ విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో బిల్లుపై చర్చ జరగలేదు. అధికార, విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన కారణంగా లోక్సభ, రాజ్యసభలను మంగళవారానికి వాయిదా వేశారు. లోక్సభలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ విపక్షాల నినాదాల మధ్య బిల్లును సభ ముందుంచారు. ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో కీలక మార్పులు ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. అయితే విపక్ష సభ్యులు నిరసన కొనసాగించడంతో సభ మొదట మధ్యాహ్నం వరకు, అనంతరం పలుమార్లు వాయిదా పడింది. చివరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధికార, విపక్ష సభ్యులతో సమావేశమై చర్చ జరిపి మంగళవారం బిల్లుపై చర్చ చేపట్టేందుకు సయోధ్య కుదిర్చినట్లు సమాచారం.రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై నిరసన తెలిపిన విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ అంశంపై ముందుగా చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభలో బిల్లును ప్రవేశపెట్టి చర్చకు సహకరించాలని ఉప సభాపతి హరివంశ్ సింగ్ కోరినా సభ్యుల ఆందోళనలు కొనసాగాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా అత్యంత కీలకమైన బిల్లుపై చర్చకు సహకరించాలని విపక్షాలను కోరినప్పటికీ ప్రతిష్ఠంభన కొనసాగడంతో సభ మంగళవారానికి వాయిదా పడింది. విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఆ అంశంపై ప్రభుత్వం వివరణ ఇచ్చిన తర్వాతే బిల్లుపై చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ విపక్షాలే సహకరించడం లేదని కిరణ్ రిజిజు ఆరోపించారు. ఈ పరిణామాలతో బిల్లుపై చర్చ వాయిదా పడింది.ప్రతిపాదిత సవరణ బిల్లులో పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి కనీసం ఐదేళ్ల నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష విధించే నిబంధనను చేర్చారు. ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల జరిమానాను రూ.50 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన సేవలందించే సంస్థలకు విధించే జరిమానాను రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచడంతో పాటు, పరీక్షల నిర్వహణ నుంచి నిషేధించే కాలాన్ని నాలుగేళ్ల నుంచి ఎనిమిదేళ్లకు పెంచాలని బిల్లులో పేర్కొన్నారు. అదేవిధంగా నేరం రుజువైన సంస్థల డైరెక్టర్లు లేదా ఉన్నతాధికారులకు కనీసం ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 కోట్ల వరకు జరిమానా విధించే ప్రతిపాదన కూడా బిల్లులో ఉంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం, ప్రశ్నపత్రాల లీకేజీలను పూర్తిగా అరికట్టడం, విద్యార్థుల భవిష్యత్తును రక్షించడం లక్ష్యంగా ఈ చట్ట సవరణను తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మంగళవారం లోక్సభలో ఈ బిల్లుపై విస్తృత చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి.




