
– నెక్లెస్ రోడ్డుపై భారీ ర్యాలీ
– ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు
– జిల్లాలకు హైడ్రా విస్తరణ కోరిన ప్రజలు
విజేత,హైదరాబాద్ ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ప్రజలు సంబరాలు నిర్వహించారు. పార్కులు, చెరువులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాల స్థలాలను ఆక్రమణల నుంచి పరిరక్షించిన హైడ్రా చర్యలను అభినందిస్తూ కాలనీల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ భూముల వద్ద బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హుస్సేన్సాగర్ నెక్లెస్ రోడ్డుకు చేరుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ గార్డెన్ నుంచి లుంబినీ పార్కు వరకు సాగిన ఈ ర్యాలీలో పాల్గొన్న వారు ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. హైడ్రా ఏర్పాటుతో నగర భవిష్యత్తుకు భరోసా కల్పించారని పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.చెరువుల పునరుద్ధరణ, పార్కుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల రక్షణలో హైడ్రా కీలక పాత్ర పోషించిందని పలువురు అభిప్రాయపడ్డారు. పచ్చదనాన్ని కాపాడటంతో పాటు ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి నగర పర్యావరణ పరిరక్షణకు దోహదపడిందని కొనియాడారు. ప్రజావసరాల కోసం కేటాయించిన భూములను సంరక్షించడం వల్ల భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. గత రెండేళ్లలో హైడ్రా మొత్తం 3,315 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించిందని కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు. ఈ భూముల విలువ సుమారు రూ.1.50 లక్షల కోట్లకు పైగా ఉంటుందని, అయితే పార్కులు, చెరువులు, పర్యావరణ పరిరక్షణ ద్వారా సమాజానికి కలిగే ప్రయోజనం అమూల్యమని అభిప్రాయపడ్డారు. భూగర్భ జలాల పరిరక్షణ, వరదల నియంత్రణలో కూడా హైడ్రా చర్యలు కీలకంగా నిలిచాయని పేర్కొన్నారు.హైడ్రా ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయమని పలువురు కొనియాడారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా హైడ్రా వ్యవస్థను విస్తరించి చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాల స్థలాలను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆక్రమణల నిర్మూలన కోసం మరింత కఠిన చర్యలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీ అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు ప్రజాప్రతినిధులు, స్థానికులు వినతిపత్రాలు సమర్పించారు. నగర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణలో హైడ్రా సేవలు మరింత విస్తరించాలని కోరుతూ కార్యక్రమాన్ని ముగించారు.




