
ఆది శ్రీనివాస్ సహకారంతో మారనున్న పట్టణ రూపురేఖలు- చైర్మన్
– వేములవాడలో వైభవంగా మత్తడి పోచమ్మ, బద్ది పోచమ్మల బోనాలు
– భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు బోనాల సమర్పణ
– మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వేడుకలు
విజేత,వేములవాడ ప్రతినిధి :రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తూర్పువాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీ మత్తడి పోచమ్మ – శ్రీ బద్ది పోచమ్మ అమ్మవార్ల బోనాల పండుగను శుక్రవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆషాఢ మాస సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ సాగిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఉత్సవాలకు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, పలువురు కౌన్సిలర్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రజాప్రతినిధులకు వేద ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.అనంతరం మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, విశిష్ట జీవన విధానానికి ఆషాఢ మాస బోనాల పండుగ ఒక ప్రతీక అని కొనియాడారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏటా ఈ ఉత్సవాలను అత్యంత భక్తిప్రపత్తులతో నిర్వహించడం అభినందనీయమన్నారు. అమ్మవారి కరుణాకటాక్షాలతో సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలతో రైతాంగం సుభిక్షంగా ఉండాలని, పట్టణ ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రానున్న మరికొద్ది రోజుల్లో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో పట్టణ రూపురేఖలు మారనున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, ఆలయ కమిటీ సభ్యులు, కూరగాయల కొమురయ్య,నామాల పోచేట్టి, అగయ్య,బోందిల మహేష్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మున్నూరు కాపు సంఘం సభ్యులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




