
*శివరాంపల్లిలో శిశుమందిర్ స్కూలు దారిలో చెత్త కుప్పలు*,
*పిల్లలు, పేరెంట్స్ అవస్థలు*
*మురికి వాసనతో ఇబ్బందులు చెత్త డబ్బాలు, గ్రీనరీ ఏర్పాటు చేయాలని స్థానికుల విజ్ఞప్తి*
విజేత,రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి గ్రామం సమీపంలో శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలకు వెళ్లే రహదారి చెత్త కుప్పలతో దర్శనమిస్తోంది. ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తుండడంతో స్కూలుకు వెళ్లే చిన్నారులు, వారిని వదిలేందుకు వచ్చే తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
*మురికి వాసనతో తిప్పలు*
పాఠశాల మార్గంలో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోందని, దోమలు, ఈగల బెడద పెరిగిందని స్థానికులు వాపోతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పిల్లలను స్కూలుకు తీసుకెళ్లే సమయంలో ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. *అధికారులు కన్నెత్తి చూడాలి* సార్లు అధికారులు ఇటువైపు కాస్త కన్నెత్తి చూడండి” అని స్థానికులు కోరుతున్నారు. రోడ్డుపై చెత్త వేయకుండా పెద్ద చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. చెత్త తొలగింపు వాహనాలు రోజూ రావడం లేదని, దీంతో సమస్య మరింత జటిలమవుతోందని చెబుతున్నారు.
*గ్రీనరీ ఏర్పాటు చేయండి*
స్కూలుకు వెళ్లే దారిలో చెత్తకు బదులు గ్రీనరీ ఏర్పాటు చేస్తే పిల్లలకు ఆహ్లాదకరంగా ఉంటుందని, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటారని తల్లిదండ్రులు సూచిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.








