
ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత
వార్డుల్లో విస్తృతంగా పర్యటించిన చైర్పర్సన్ సరిత శ్రీనివాస్
పూడికతీత పనుల పరిశీలన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
విజేత,చొప్పదండి: ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తూ పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యమని చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ వడ్లురి సరిత శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ కమిషనర్తో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో ఆమె విస్తృతంగా పర్యటించారు.పూడికతీత పనులు, వార్డుల పరిశీలన,పట్టణంలోని కుడి చెరువు వరద నీటి కాలువలో కొనసాగుతున్న పూడికతీత పనులను చైర్పర్సన్ పరిశీలించారు. అనంతరం 1వ వార్డులో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వార్డుల్లో పారిశుధ్య నిర్వహణ,తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
స్థానికులు తాగునీటి కొరత, డ్రైనేజీ కాలువల నిర్వహణలో లోపాలు,దెబ్బతిన్న రహదారులు, పారిశుధ్య సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు.సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయాలని,పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.అంగన్వాడీ, పాఠశాల సందర్శన,అనంతరం తోగురుమామిడికుంట అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు పాఠ్య పుస్తకాలు,నోట్స్ పంపిణీ చేశారు. విద్యతోనే మంచి భవిష్యత్తు నిర్మాణం సాధ్యమనే ఉద్దేశంతో చిన్నారులను ప్రోత్సహించారు.ప్రతి వార్డులో మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన పౌర సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిషనర్,స్థానిక కౌన్సిలర్లు, వివిధ శాఖల మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.










