
విజేత,వరంగల్ ప్రతినిధి : హంటర్ రోడ్డులోని ఎలిఫెంట్ సర్కిల్, తేజస్వి స్కూల్ మలుపు వద్ద ఉన్న ఆర్టీసీ బస్టాప్లో వాసవి క్లబ్ సాయి నరసింహ ఆధ్వర్యంలో శనివారం పరిసరాల శుభ్రతా కార్యక్రమం చేపట్టారు.గతేడాది ‘డాన్ టు డస్క్’ (Dawn to Dusk) సేవా కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థులు, ప్రయాణికుల సౌకర్యార్థం ఇక్కడ రెండు సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుత వర్షాకాలం కారణంగా ఆ బెంచీల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి, ఖాళీ ప్లాస్టిక్ సీసాలు, ఇతర వ్యర్థాలు పేరుకుపోయాయి. దీంతో ప్రయాణికులు కూర్చునేందుకు ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన క్లబ్ సభ్యులు శ్రమదానం చేసి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. వ్యర్థాలను తొలగించి, బెంచీలను వినియోగంలోకి తెచ్చారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సాయి నరసింహ అధ్యక్షుడు నాగమల్ల సతీష్ కుమార్, రీజినల్ కోఆర్డినేటర్ కుక్కడ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.









