కేజీబీవీ గేటు ముందే జోరుగా మద్యం విక్రయాలు

ములుగుజిల్లా కన్నాయిగూడెం మండలం ముప్పైనపెల్లి

విద్యార్థితుల హాస్టల్‌కు కొన్ని మీటర్ల దూరంలోనే బెల్ట్‌షాప్‌ నిర్వహణజోరుగా సాగుతుంది.

రోజంతా మద్యం కొనుగోలుదారుల రాకపోకలు.. పట్టించుకోని అధికారులు

విజేత,కన్నాయిగూడెం : ముప్పనపల్లి గ్రామంలో విద్యార్థినుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) హాస్టల్, హైస్కూల్ ప్రధాన గేటుకు సమీపంలోనే ఓ వ్యాపారి బహిరంగంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి.కేజీబీవీ హాస్టల్‌లో వందలాది మంది బాలికలు ఉంటుండగా, పాఠశాల గేటు సమీపంలోనే మద్యం విక్రయాలు కొనసాగుతుండటంతో విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో వ్యక్తులు అక్కడికి వచ్చి వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు.విద్యాసంస్థలు, బాలికల హాస్టళ్ల పరిసరాల్లో ఇలాంటి కార్యకలాపాలు కొనసాగడం వల్ల విద్యార్థినులపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు, భద్రతపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హాస్టల్‌కు, పాఠశాల గేటుకు కొన్ని మీటర్ల దూరంలోనే మద్యం విక్రయాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.చిన్న సంఘటన జరిగిన తర్వాత స్పందించడం కంటే.. ముందుగానే ఇలాంటి పరిస్థితులను నియంత్రించాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. విద్యార్థినుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకముందే సంబంధిత ఎక్సైజ్, పోలీసు, విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాల, హాస్టల్ పరిసరాల్లో జరుగుతున్న మద్యం విక్రయాలపై విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.విద్యార్థినుల భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :