
కథ ముగిసింది.. కానీ మిస్టరీ మిగిలింది! పెంజర్ల దగ్గర ‘ఆరు హత్యల’ నిందితుడి అనుమానాస్పద మృతి
షాబాద్ కిల్లర్ ఎండ్ గేమ్ మేనమామ ఊరిలో శవంగా మారిన రాజ్కుమార్
విజేత,రాజేంద్రనగర్ : షాబాద్ను వణికించిన ఆరు హత్యల కేసులో అత్యంత కీలకమైన, అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆరు ప్రాణాలను బలితీసుకుని, పోలీసులకు సవాల్గా మారిన ప్రధాన నిందితుడు రాజ్కుమార్ కథ విషాదాంతమైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ సమీపంలో సోమవారం రాజ్కుమార్ మృతదేహం లభ్యమవ్వడం తీవ్ర సంచలనం రేపుతోంది.
మేనమామ ఊరిలోనే అంతం..
పోలీసుల వేట తీవ్రమవడంతో రాజ్కుమార్ తన మేనమామ గ్రామమైన పెంజర్లకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, సోమవారం ఉదయం పెంజర్ల గ్రామ శివార్లలో ఒక మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు షాక్కు గురయ్యారు.వెంటనే వారు డయల్–100కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా..అది షాబాద్ కేసులో మోస్ట్ వాంటెడ్గా ఉన్న రాజ్కుమార్ మృతదేహమేనని తేలింది.
పక్కనే పాయిజన్ బాటిల్.. ఆత్మహత్యా? మరేదైనా?
ఘటనా స్థలంలో రాజ్కుమార్ మృతదేహం పక్కనే ఒక విషపు బాటిల్ లభ్యమవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల నిఘా నీడ, ఆరు హత్యల పాపం వెంటాడటంతోనే రాజ్కుమార్ విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఇది ఆత్మహత్యా? లేక దీని వెనుక మరేదైనా కోణం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.పోస్టుమార్టం రిపోర్ట్ పైనే కళ్లు..పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజ్కుమార్ మృతికి గల అసలు కారణాలు, అతడు ఎప్పుడు విషం తాగాడు అనే విషయాలు పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ పరీక్షల తర్వాతే అధికారికంగా వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.ఆరు హత్యల కేసు దర్యాప్తు క్లైమాక్స్కు చేరిందనుకున్న తరుణంలో.. ప్రధాన నిందితుడే శవమై తేలడంతో ఈ కేసు ఇప్పుడు మరింత ఉత్కంఠభరితంగా మారింది.






