
*గండిపేట్ వరద కాలువ ఆక్రమణలపై ఉక్కుపాదం ఎఫ్టీఎల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత*
*మంచిరేవులలో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి*
విజేత,రాజేంద్రనగర్ : గండిపేట్ చెరువు ప్రధాన వరద కాలువ ఆక్రమణలపై రెవెన్యూ శాఖ ఉక్కుపాదం మోపింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు సోమవారం కూల్చివేశారు.*పోలీసు బందోబస్తుతో కూల్చివేత* మంచిరేవుల గ్రామ పరిధిలోని మచిలేశ్వర స్వామి దేవాలయానికి చెందిన సర్వే నంబర్లు 327, 328, 329లో అక్రమంగా వెలసిన నిర్మాణాలను భారీ పోలీసు బందోబస్తు నడుమ జేసీబీల సహాయంతో నేలమట్టం చేశారు. ముందస్తు సమాచారంతో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు.*ఆక్రమణలకు తావులేదు: తహసీల్దార్* ఈ సందర్భంగా గండిపేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “గండిపేట్ వంటి కీలక జలాశయాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఆక్రమణలను గుర్తించి కూల్చివేస్తున్నాం. చెరువులు, కుంటలు, వరద కాలువల పరిరక్షణే మా ప్రధాన ధ్యేయం. ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.*నోటీసులు జారీ చేసిన తర్వాతే..* కూల్చివేతకు ముందు సంబంధిత యజమానులకు పలుమార్లు నోటీసులు జారీ చేశామని, స్వచ్ఛందంగా తొలగించుకోక పోవడంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆక్రమణలపై నిరంతరం నిఘా ఉంటుందని తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.







