కొందరు కావాలనే ఓడించారు: తుమ్మల
గత ఏడాది కలిసి రాలేదని, కొందరు స్వార్థపరులు కావాలనే పని గట్టుకొని మనల్ని ఓడించారని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. సత్తుపల్లిలో పాలేరు నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. గంట పాటు అనుచరులు, కార్యకర్తలతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
రాజకీయాల్లో అటు పోట్లు, గెలుపు ఓటములు సహజం. ఓటమి గురించి ఆలోచించకుండా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాజకీయ కారణాలు ఎలా ఉన్న కొంత కాలం సర్దుకుని పోవాలన్నారు. తాత్కాలిక ఇబ్బందులు వచ్చిన కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని తెలిపారు. వేల మంది తన కోసం రావడం ఆనందం ఉందని, రాబోయే రోజుల్లో అండగా ఉంటానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కేసీఆర్ కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని అనుచరులకు తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.