ఒలంపిక్ మెడల్ విజేత సింధుకు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం
టోక్యోలో ఒలింపిక్స్ పతకం గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు మంగళవారం భారతదేశానికి తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వద్ద ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వ అధికారులు, అభిమానులతో ఎయిర్ పోర్ట్ నిండిపోయింది. '' ఈ విజయంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను, దేశానికి కీర్తి తెచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు. నేను చాలా ఉత్సాహంగా వున్నా. ప్రజలకు ధన్యవాదాలు. '' అని ఢిల్లీ విమానాశ్రయంలో సింధు మీడియాతో అన్నారు.
టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనడానికి బయలుదేరే ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆటగాళ్ళందరినీ కలిశారు. వారిలో ధైర్య నింపారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు విజయంపై విశ్వాసం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ, తన విజయం తర్వాత ఆమెతో కలిసి ఐస్ క్రీం తింటాను అని అన్నారు.
ప్రపంచ నెం .9 చైనాకు చెందిన హెబిన్ జియావో తో పోటీ పడి పివి సింధు ఆమెను ఓడించి కాంస్య పతకం సాదించారు. ఈ పోటీలో జియావోను 21-13, 21-15తో ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది సింధు. ప్రపంచ నెం .7 సింధుకు ఈ మ్యాచ్ గెలవడంలో చెప్పుకోదగ్గ సమస్యలేవీ రాలేదు. కేవలం 52 నిమిషాల్లో ఈ మ్యాచ్ గెలిచింది సింధు. ఒలింపిక్ క్రీడల్లో 26 ఏళ్ల సింధుకి ఇది రెండో పతకం. ఆమె అంతకు ముందు 2016 రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించారు.