సీట్ల సర్దుబాటుపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత, పొత్తులపై స్పందించిన పురందేశ్వరి
ఏపీలో పొత్తులు కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ, టీడీపీ, జనసేన(BJP TDP JSP) వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు మూడు పార్టీలు శనివారం పొత్తులపై ఉమ్మడి ప్రకటన చేశాయి. ఈ పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandeswari) స్పందించారు. పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనతో పొత్తు కుదరడం సంతోషమన్నారు. అయితే సీట్ల సర్దుబాటుపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. శ్రీరాముడికి కూడా ఉడుత సాయం అవసరమైందని, ఏపీలో అరాచక పాలన అంతం చేయడానికి అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే ఈ పొత్తులని స్పష్టం చేశారు.