టీమిండియాని ఆదుకున్న పుజారా, పంత్
చెన్నై వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. పుజారా(57), పంత్(63) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్కు 578 పరుగుల భారీ స్కోరు సమర్పించుకున్న కోహ్లి సేన.. అప్పుడే 2 వికెట్లు కోల్పోయింది. మూడో రోజు లంచ్ సమయానికి 2 వికెట్లకు 59 పరుగులు చేసింది. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ధాటికి ఓపెనర్లు రోహిత్ శర్మ (6), శుభ్మన్ గిల్ (29) పెవిలియన్ చేరారు. ఆ తరువాత కోహ్లీ(11), రహానే(1) వెంట వెంటనే ఔట్ కావడంతో టీమిండియా 73 పరుగులకే నాలుగు వికెట్లు నష్టపోయి కష్టాలలో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్ తో కలిసి పుజారా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.
పుజారా తన సహజసిద్ధమైన ఆట తీరును కనబరచగా పంత్ దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ వేగంగా ఆడటంతో ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ బౌలింగ్ లో పలు మార్పులు చేశాడు. కానీ పంత్ భారీ షాట్లతో విరుచుకుపడటంతో టీమిండియా స్కోరు వేగంగా పరుగులు పెట్టింది. ఈ క్రమంలో పుజారా 106 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తరువాత పంత్ కూడా అర్ద సెంచరీ మార్క్ దాటేశాడు. పంత్ కేవలం 40 బాల్స్ లోనే అర్ద సెంచరీ చేయడం విశేషం. వీరిద్దరూ క్రీజులో నిలదొక్కుకోవడంతో టీమిండియా టీ విరామానికి 154 పరుగులు చేసింది. టీ విరామం తరువాత కూడా పంత్ వేగంగా ఆడటంతో టీమిండియా 44 ఓవర్లు ముగిసేసరికి 167 పరుగులు చేసింది. పుజారా(57), పంత్(63) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ కన్నా టీమిండియా ఇంకా 411 పరుగుల వెనుకబడి ఉంది.