సచిన్, కోహ్లీల ట్వీట్లపై మహరాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు
కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళనకు అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు వచ్చిన విషయం తెలిసిందే. అమెరికా పాప్ సింగర్ రిహానా, మియా మాల్కోవా, మీనా హారిస్, గ్రెటా థన్బర్గ్ ట్వీట్లు చేసి తమ మద్దతు ప్రకటించారు. కాగా, దేశ అంతర్గత విషయాల్లో విదేశీయులు జోక్యం చేసుకోవద్దంటూ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వ ప్రకటనకు మద్దతుగా సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ, ప్రముఖ గాయని లతా మంగేష్కర్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ లాంటి ప్రముఖులు ట్వీట్లు చేశారు. వేర్వేరు రంగాలకు చెందిన వీళ్లంతా.. ఒకే విధంగా ట్వీట్లు చేయడంపై మహారాష్ట్ర ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. ఈ ట్వీట్లపై దర్యాప్తు చేస్తామని ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ ప్రకటించారు.
ఈ ట్వీట్ల వెనుక కేంద్ర ప్రభుత్వం లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో ఇంటిలిజెన్స్ సంస్థలు దర్యాప్తు చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఒత్తిడితోనే సచిన్, కోహ్లీ, మంగేష్కర్, అక్షయ్ వంటి వారు ఈ ట్వీట్స్ చేశారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఆరోపించారు.