భారత టెన్నిస్ దిగ్గజం అక్తర్ అలీ మృతి
భారత టెన్నిస్ దిగ్గజం, డేవిస్ కప్ కోచ్ అక్తర్ అలీ మృతిచెందారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కొంతకాలంగా ప్రొస్టేట్ క్యాన్సర్, పార్కిన్సన్, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడతున్న అక్తర్ రెండు వారాల కిందట కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం డేవిస్ కప్ కోచ్ జీషన్ అలీ ఆయన కుమారుడే. దూకుడుగా సర్వీస్ చేయడం అక్తర్ ప్రత్యేకత. విజయ్ అమృత్రాజ్, రమేష్ కృష్ణన్ లాంటి క్రీడాకారులెందరో అక్తర్ ఆట నుంచి స్ఫూర్తి పొందారు.
జీషన్ అలీ, లియాండర్ పేస్కు అక్తర్ అలీ వ్యక్తిగతంగా కోచ్ గా వ్యవహరించారు. ఎంతో మంది టెన్నిస్ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో అక్తర్ కీలక పాత్ర పోషించారు. అక్తర్ అలీ మృతి పట్ల పలువురు క్రీడాకారులు సంతాపం ప్రకటించారు. ప్రియమైన అక్తర్కు నివాళులు. జీషన్, అతని కుటుంబ సభ్యులకు నా సానుభూతి అంటూ విజయ్ అమృత్రాజ్ ట్వీట్ చేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్తర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.