పంత్ బెయిల్ దాచేశాడా?




టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటు పట్టి ఎంత దూకుడుగా ఆడుతుంటాడో.. మైదానంలో అంత అల్లరి చేస్తుంటాడు. ఒక్కోసారి అతడి చేష్టలు డ్రెస్సింగ్ రూమ్‌లోనే కాకుండా మైదానంలో కూడా నవ్వు తెప్పిస్తుంటాయి. కాగా, తాజాగా ముగిసిన టెస్టు మ్యాచ్‌లో పంచ్ చేసిన ఒక పని అంపైర్లను కంగారు పెట్టించింది. అక్కడ ఏం జరుగుతున్నదో అర్థం కాక.. స్టేడియంలో, టీవీలు చూస్తున్న ప్రేక్షకులు అయోమయానికి గురయ్యారు. 

ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్‌ 43వ ఓవర్లో ఓలీ పోప్‌ మిడ్‌ వికెట్‌ దిశగా షాట్‌ ఆడగా.. అక్కడే ఉన్న విరాట్ కోహ్లీ బంతిని అందుకొని వికెట్ కీపర్ రిషబ్ పంత్ ‌వైపు త్రో విసిరాడు. అయితే బంతిని అందుకోవడంలో పంత్‌ విఫలమయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌కు సిద్ధమవుతుండగా.. వికెట్‌పై ఒక బెయిల్‌ కనిపించలేదు. దీన్ని గమనించిన ఫీల్డ్ అంపైర్ బెయిల్ కోసం వెతుకులాట ప్రారంభించాడు.

కోహ్లీ, రోహిత్ సహా మిగతా ఫీల్డర్లు కూడా బెయిల్ కోసం వెతకడం మొదలు పెట్టారు. కోహ్లీ వచ్చి పంత్ జేబుల్లో ఏమైనా ఉందేమోనని వెతికినా దొరకలేదు. ఇంతలోనే బెయిల్ ఎటు పోయిందా అని అందరూ సందేహపడుతున్నారు. అయితే పంత్ వచ్చి రోహిత్ శర్మ పక్కన నిలబడ్డాడు. ఆ సమయంలో పంత్ గ్లోవ్స్‌లో బెయిల్‌ ఇరుకున్నట్టు రోహిత్‌ గమనించాడు. దీంతో పంత్‌.. బెయిల్‌ నీ గ్లోవ్స్‌లోనే ఉందిగా! తీసి అంపైర్‌కు ఇచ్చేయ్‌ అని అన్నాడు. 

దీంతో వెంటనే పంత్ బెయిల్ తీసి ఇచ్చాడు. దీంతో ఆట తిరిగి మొదలయ్యింది. కాగా, అసలు పంత్ దగ్గర బెయిల్ ఉన్నా ఇవ్వలేదా? మ్యాచ్ సీరియస్‌గా జరుగుతున్న సమయంలో ఇలాంటి ప్రాక్టికల్ జోక్ పంత్ ఎందుకు చేశాడో ఎవరికీ అర్దం కాలేదు.


Latest News
more

Trending
more