ఈ సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలం చీమలకొండూరులో చోటుచేసుకుంది. ఎస్ఐ వీ.సంతో్షకుమార్, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... చీమలకొండూరు గ్రామానికి చెందిన బీట్కూరి మనోహర్, అదే గ్రామానికి చెందిన పల్లెర్ల భూమిక(19) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వేర్వేరు కులాలు కావడంతో మనోహర్ కుటుంబసభ్యులు వీరి వివాహానికి అంగీకరించలేదు. అయితే ఫిబ్రవరి 17న యాదగిరిగుట్టలో మనోహర్, భూమిక కులాంతర వివాహం చేసుకున్నారు. కాగా, వివాహం అనంతరం వారిద్దరూ చీమలకొండూరులోని మనోహర్ ఇంటికి వచ్చారు. కులం తక్కువదానివి అంటూ అత్త స్వరూప సూటిపోటి మాటలతో వేధిస్తుండటంతో విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు పంచాయితీ పెట్టి ఇరు కుటుంబాలను సముదాయించారు. అయితే అత్తతో పాటు భర్త కూడా వేధిస్తున్నాడని భూమిక మనోవేదనకు గురైంది. ఈ నెల 2వ తేదీన అదే గ్రామంలో ఉంటున్న తల్లిగారింటికి వెళ్లింది. అత్తంటి వ్యవహారశైలిపై తీవ్ర మనస్తాపంతో ఉన్న భూమిక ఈ నెల 6వ తేదీన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. బంగ్లాపై దుస్తులు ఆరవేస్తున్న తల్లి రేణుక అనుమానంతో కిందికి వచ్చి కిటికీలోంచి గదిలో చూడగా భూమిక తాడుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారిని కేకలు వేస్తూ పిలిచి తలుపులను పగులగొట్టి లోపలికి వెళ్లేలోగా భూమిక అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను హుటాహుటిన భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులు అక్కడ చికిత్స పొందుతూ భూమిక శనివారం మృతి చెందింది.
భూమిక మృతదేహంతో ఆందోళన
అత్తింటి వేధింపులతోనే భూమిక ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొ ంటూ ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆమె మృతదేహంతో మనోహర్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు.ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. విషయం తెలుసుకున్న రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన ఏసీపీ రవికిరణ్రెడ్డి, ఎస్ఐ సంతో్షకుమార్ బందోబస్తుతో గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భూమిక కుటుంబసభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరికి తరలించారు. రెండు గంటల పాటు ఆందోళన జరిగింది. భూమిక తల్లి రేణుక ఫిర్యాదు మేరకు ఆమె భర్త మనోహర్, అత్త స్వరూపపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ సంతో్షకుమార్ తెలిపారు.