దేశంలో కరోనా టెన్షన్.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా తీవ్రత క్రమంలో పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు పెరగడం కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.
ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,927 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 32 మంది మృతిచెందారు. మరో 2,252 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16,279 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. ఇదే సమయంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతంగా నమోదు అయింది. మరోవైపు.. దేశంలో ఇప్పటివరకు 4,30,65,496 కరోనాబారినపడ్డారు. కోవిడ్ సంబంధిత మరణాల సంఖ్య 5,23,654 కు చేరుకుంది. ఇక, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,88,19,40, 971 మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది.
ఇదిలా ఉండగా.. దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజా పరిస్థితి, కోవిడ్ నియంత్రణ చర్యలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ బుధవారం మధ్యాహ్నాం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.