పరాజయం అంచున టీమిండియా!
చెన్నై వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమి దిశగా సాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 39/1 పరుగుల వద్ద బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా తొలి సెషన్లో పేకమేడలా కుప్పకూలింది. దీంతో లంచ్ సమయానికి కోహ్లి సేన 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ కోహ్లి (45), అశ్విన్ (2) ఉన్నారు. జట్టు స్కోరు 58 పరుగుల వద్ద పుజారా(15) ఔట్ కావడంతో టీమిండియా రెండవ వికెట్ నష్టపోయింది. ఈ దశలో కోహ్లీతో కలిసి గిల్ జట్టు స్కోరును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో గిల్ అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే గిల్(50) పెవిలియన్ చేరడంతో టీమిండియా 92 పరుగుల వద్ద మూడవ వికెట్ నష్టపోయింది.
ఇంగ్లాండ్ పేసర్ ఆండర్సన్ ధాటికి ఇండియన్ టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. రహానే (0), రిషబ్ పంత్ (11), వాషింగ్టన్ సుందర్ (0) విఫలమయ్యారు. 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి.. ఒక దశలో లంచ్కు ముందే ఆలౌటవుతారా అని అనిపించింది. అయితే కోహ్లి, అశ్విన్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 3, లీచ్ 2, బెస్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో గెలవాలంటే టీమిండియా 276 పరుగులు చేయవలసి ఉంది. అయితే మరో రెండు సెషన్ల ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్లో టీమిండియా గట్టెక్కడం అసాధ్యంగానే కనిపిస్తోంది.