ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ ప్రయత్నం పలువురి అరెస్ట్
భారతీయ జనతా పార్టీ తరపున కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ ను మంగళవారం ముట్టడి చేయడానికి ప్రయత్నించారు. ప్రగతి భవన్ సమీపంలోని హరితా ప్లాజాలో బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం తరువాతఅనూహ్యంగా బిజెపి కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు ప్రగతి భవన్ వైపు పరుగులు తీశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో వెంటనే కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ లోకి వెళ్ళడానికి బిజెపి నాయకులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పలువురు బిజెపి కార్పొరేటర్లు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.