హామీలు అమలు చేయండి.. లేకుంటే ఉద్యమమే..

తెలంగాణ ఉద్యమకారులను వెంటనే గుర్తించాలి..

విజేత, వేములవాడ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమకారులందరినీ ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా మరో ఉద్యమం చేపడతామని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్మన్ గజ్జెల దేవరాజ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మేకల రామచంద్రం అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన విషయం తెలుసుకున్న తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా రామచంద్రంకు ఆర్థిక సహాయం అందజేసి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా గజ్జెల దేవరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మేకల రామచంద్రం కీలక పాత్ర పోషించారని, రిలే నిరాహార దీక్షలు, సకల జనుల సమ్మె, వంటావార్పు వంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడారని పేర్కొన్నారు.తెలంగాణ కోసం జీవితాలను, కుటుంబాలను పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులు నేడు అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో జీవించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వారిని ప్రభుత్వం వెంటనే గుర్తించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పింఛన్, ఉద్యమకారులపై నమోదైన కేసుల ఎత్తివేత, మరణించిన ఉద్యమకారుల కుటుంబాలకు పింఛన్‌తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరికాదన్నారు.సెప్టెంబర్ 17లోపు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారికి ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులందరిని ఏకం చేసి ఉద్యమకారుల కోసం ఉద్యమం అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫణి రాజారావు, వికాస్ సమితి జిల్లా అధ్యక్షులు, మాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అక్కెనపెల్లి కరుణాకర్, కుసపెల్లి సరస్వతి, సింగారం దేవరాజు, కర్నె లక్ష్మీ, గూగులోతు రేనా, పత్తిపాక పద్మశంకర్, మామిడాల రమణ, నేరల శ్రీకాంత్ గౌడ్, డాక్టర్ ఓదెల శ్రీనివాస్, అఫ్రోజ్, సికిందర్, పవన్, సాయిశరత్, సాయి గౌడ్, చోటు బాబా తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :