ఘనంగా గడికోట మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు

భక్తి పారవశ్యంలో మహేశ్వరం అమ్మవారికి బోనాలతో మహిళల మొక్కులు

పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించిన గ్రామ ప్రజలు

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మహేశ్వరం ప్రజాప్రతినిధులు

విజేత,మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని పురాతన గడికోట మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరిగాయి. సర్పంచ్ మునగపాటి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు.

తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహిళలు, యువతులు తలపై బోనాల కలశాలను ఎత్తుకొని, పసుపు, కుంకుమలతో, సంప్రదాయ బద్దంగా ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాల నడుమ జరిగిన ఊరేగింపు ఆకట్టుకుంది.

భక్తుల జై మైసమ్మ నినాదాలతో గడికోట పరిసరాలు మార్మోగాయి.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ… వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నామని, ప్రతి ఏటా ఈ బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మునగపాటి నవీన్ గౌడ్, ఉప సర్పంచ్ జోర్ల రమేష్, సీనియర్ నాయకులు కర్రోళ్ల చంద్రయ్య, అంబయ్య, మాజీ ఎంపీటీసీ సుదర్శన్ యాదవ్, కాకి ఈశ్వర్, పోల్కం బాలయ్య, మహేందర్ ముదిరాజ్ తో పాటు గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.