
విజేత,చొప్పదండి: గ్రామీణ యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడా ప్రాంగణం పశువుల పాకగా మారింది.చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ప్రస్తుతం పూర్తిగా నిరుపయోగంగా మారింది. మైదానం అంతా పిచ్చిమొక్కలు,గడ్డితో నిండి, ఆవులు, గేదెలు, మేకలు మేస్తూ కనిపిస్తున్నాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఆడాల్సిన చోట పశువులు మేయడం గమనార్హం.ఈ క్రీడా ప్రాంగణానికి కనీసం గ్రౌండ్ లెవలింగ్,శుభ్రత,క్రీడా పరికరాలు,లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని స్థానిక యువత,గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి ఈ క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేసి,యువతకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.








