ఆరోగ్యమే సమర్థ సేవలకు పునాది: సీపీ శ్వేత

ఆరోగ్యమే సమర్థ సేవలకు పునాది: సీపీ శ్వేత

వారాంతపు పరేడ్ పరిశీలన

పోలీసులకు ఆరోగ్య సూచనలు

– క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి

విజేత ,వరంగల్ ప్రతినిధి): సమాజం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలంటే ముందుగా పోలీసు సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా శనివారం కమిషనరేట్ మైదానంలో నిర్వహించిన వారాంతపు పరేడ్‌ను ఆమె పరిశీలించి పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా, క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతతో పనిచేస్తేనే ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించగలరని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి పోలీసు అధికారికి ముఖ్య బాధ్యత అని పేర్కొన్నారు.

 

ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సిబ్బందికి సీపీ సూచించారు. ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి వ్యాయామం, యోగా చేయాలని, దినచర్యలో మార్పులు చేసుకుంటే ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని వివరించారు. ఆరోగ్యవంతమైన పోలీసు బలగమే సమాజానికి మెరుగైన సేవలు అందించగలదని తెలిపారు. క్రమశిక్షణే పోలీసు వ్యవస్థకు బలమని సీపీ శ్వేత స్పష్టం చేశారు. విధుల నిర్వహణలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి పోలీసు సిబ్బంది తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

వారాంతపు పరేడ్‌లో పోలీసు సిబ్బంది కవాతు, క్రమశిక్షణ, సిద్ధతను సీపీ పరిశీలించారు. విధి నిర్వహణలో మరింత నైపుణ్యం పెంపొందించుకునేందుకు శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. పోలీసు సేవల్లో ప్రజాకేంద్రిత విధానాన్ని మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేష్ కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు అంతయ్య, సత్యనారాయణ, ఆర్‌ఐలు స్పర్జన్ రాజ్, సతీష్, శ్రీధర్, చంద్రశేఖర్, ఉదయ్ భాస్కర్, ఇన్‌స్పెక్టర్లు వెంకన్న, సువర్ణ, సుజాతతో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.