రాజేంద్రనగర్ పిల్లర్ నెం. 248 వద్ద విషాదం
సోషల్ మీడియా మోజు ప్రాణాలు తీస్తోందని ఆగ్రహం
విజేత,రాజేంద్రనగర్ : సోషల్ మీడియాలో రీల్స్ చేయాలనే మోజు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రాజేంద్రనగర్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 248 వద్ద ఓ యువకుడు రీల్స్ కోసం కోబ్రా పాము పిల్లను పట్టుకోబోయి, అది కాటేయడంతో మూడు గంటల్లోనే మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగింది?
స్థానికుల కథనం ప్రకారం, పిల్లర్ నెం. 248 సమీపంలో ఓ యువకుడు కోబ్రా పాము పిల్లను చూశాడు. వెంటనే సోషల్ మీడియాలో రీల్ చేసి పోస్ట్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆ కోబ్రా పిల్ల అతడి చేతిని కాటేసింది.వెంటనే స్థానికులు అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.అయితే విషం శరీరంలోకి వేగంగా వ్యాపించడంతో చికిత్స పొందుతూ మూడు గంటల్లోనే యువకుడు ప్రాణాలు విడిచాడు.
రీల్స్ మోజు వద్దు: స్థానికులు
సోషల్ మీడియా రీల్స్, లైక్స్, వ్యూస్ కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షణికావేశంలో, సరదా కోసం చేసే పనులు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగుల్చుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.*స్నేక్ క్యాచర్స్ హెచ్చరిక* పాములు కనిపిస్తే సాహసాలు చేయొద్దని, వెంటనే స్నేక్ సొసైటీ లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని స్నేక్ క్యాచర్స్ సూచిస్తున్నారు.కోబ్రా పిల్ల విషం కూడా పెద్ద పాముతో సమానంగా ప్రమాదకరమని, నిర్లక్ష్యం వద్దని హెచ్చరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది..