86 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1.07 లక్షలకుపైగా ఓటర్లు
రాజకీయ పార్టీల సహకారంతో ప్రక్రియ వేగవంతం చేయాలని
తహశీల్దార్ బొమ్మ రాములు ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలతో కీలక సమావేశం
విజేత,రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని తహశీల్దార్ బొమ్మ రాములు రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.అర్హులైన ప్రతి ఓటరు తమ ఎన్యుమరేషన్ ఫారాలను వెంటనే పూర్తి చేసి సంబంధిత బూత్ స్థాయి అధికారులకు బిఎల్ఓలకు అందజేయాలని ఆయన సూచించారు.రాజేంద్రనగర్ తహశీల్దార్ కార్యాలయంలో లక్ష్మీగూడ, మైలార్దేవ్పల్లి, కాటేదాన్, గగన్పహాడ్, శాస్త్రిపురం, బుద్వేల్ తదితర ప్రాంతాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, మండల పరిధిలోని 86 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 1,07,441 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు 53,264 మంది ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాల కంప్యూటరీకరణ పూర్తయిందని, ఇంకా 47,714 ఫారాలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు.పెండింగ్ జాబితాలను అన్ని రాజకీయ పార్టీలకు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదు కావడం ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమని పేర్కొంటూ, ప్రజల్లో అవగాహన కల్పించి పెండింగ్ ఫారాల పూర్తి ప్రక్రియకు రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు చురుకుగా సహకరించాలని తహశీల్దార్ బొమ్మ రాములు విజ్ఞప్తి చేశారు.
