స్థానికుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ఎల్లారెడ్డిపేట పోలీసులు
విజేత ఎల్లారెడ్డిపేట: సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై రాగట్లపల్లి సమీపంలో ఏర్పడిన ప్రమాదకర గుంత వద్ద పోలీసులు స్టాపర్ బోర్డును ఏర్పాటు చేశారు. రహదారిపై గుంత కారణంగా వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని గుర్తించిన పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.స్థానిక కాంగ్రెస్ నాయకుడు మందాటి లక్ష్మణ్ యాదవ్ రహదారిపై ఏర్పడిన గుంత విషయాన్ని ఆర్అండ్బీ అధికారులు, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట సీఐ వెంకటేష్, ఎస్ ఐ రమేష్ ఆదేశాల మేరకు గ్రామ పోలీసు అధికారి షబ్బీర్ గుంత వద్ద స్టాపర్ బోర్డును ఏర్పాటు చేశారు.రాత్రి వేళల్లో గుంత స్పష్టంగా కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండటంతో, ముందస్తు జాగ్రత్తగా స్టాపర్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో వాహనదారులు అప్రమత్తంగా వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది.అయితే గుంతకు తాత్కాలికంగా స్టాపర్ ఏర్పాటు చేయడంతో పాటు సంబంధిత ఆర్అండ్బీ అధికారులు గుంతను శాశ్వతంగా పూడ్చి రహదారిని మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు.సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్థానిక నాయకుడు మందాటి లక్ష్మణ్ యాదవ్కు, వెంటనే స్పందించి స్టాపర్ ఏర్పాటు చేసిన పోలీసు శాఖకు రాగట్లపల్లి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.