జియో యూజర్లకు అలర్ట్.. ఈ తప్పులు చేయొద్దని హెచ్చరిక
29-12-2021
272
ఈ-కేవైసీ పేరుతో జరుగుతోన్న మోసాలకు సంబంధించి జియో తమ కస్టమర్లను అలర్ట్ చేసింది. జియో యూజర్లు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయొద్దని సూచించింది. ఇంతకీ ఆ తప్పులేంటో తెలుసా..?
టెలికాం రంగంలో పెను సంచలనంగా దూసుకొచ్చింది రిలయన్స్ జియో. అత్యంత తక్కువ సమయంలో 40 కోట్లకు పైగా కస్టమర్లను సంపాదించుకొని దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే జియో తాజాగా తమ కస్టమర్లకు సైబర్ మోసాల బారిన పడకుండా పలు కీలక సూచనలు చేసింది.
ఈ-కేవైసీ వెరిఫికేషన్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఏ నెంబర్ నుంచి పడితే ఆ నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్కు స్పందించకూడదని తెలిపింది.
కేవైసీ అప్డేట్ లేదా ఇతర వెరిఫికేషన్స్ కోసం ఎలాంటి థార్డ్ పార్టీ యాప్లను డౌన్లోడ్ చేసుకోకూడదని జియో సూచించింది. జియో తరఫున కాల్ చేస్తున్నామని ఎవరైనా ఆధార్ నెంబర్, ఓటీపీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడిగితే స్పందించకండని, జియో ఎప్పుడూ వినియోగదారుల బ్యాంక్ వివరాలను అడగదు.
ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే మీ కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుందని జియో కస్టమర్ కేర్ పేరిటి ఎలాంటి కాల్ వచ్చినా నమ్మకండి అని జియో తెలిపింది. ఈ-కేవైసీ పేరుతో మెసేజ్ వచ్చిన ఫోన్ నెంబర్కు ఎట్టి పరిస్థితుల్లో కాల్ బ్యాక్ చేయకూడదని జియో అలర్ట్ చేసింది. సాధారణంగా కాల్ బ్యాక్ చేస్తే థార్డ్ పార్టీ యాప్లను డౌన్లోడ్ చేయని చెబుతారు. అలాచేస్తే మీ ఫోన్ను హ్యాకర్లు వారి ఆధీనంలోకి తీసుకెళ్లే అవకాశాలున్నాయి.
జియో పేరుతో ఏవైనా లింక్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో స్పందించకూడదని జియో తెలిపింది. లింక్లపై క్లిక్ చేయమని జియో అడగదని జియో తెలిపింది. థార్డ్ పార్టీ యాప్లను డౌన్లోడ్ చేసుకోమని జియో కస్టమర్లను ఎప్పుడూ ఆదేశించదు. జియోకు సంబంధించిన అన్ని వివరాలు మై జియో యాప్లో మాత్రమే ఉంటాయని తెలిపింది.