జిల్లాలో వరి ధాన్యాన్ని సేకరించేందుకు 64 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జిల్లా అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు
అక్షర విజేత జోగులాంబ గద్వాల్ ప్రతినిధి
రైతులు పండించిన వరి ధాన్యాన్ని సేకరించేందుకు జిల్లాలో 64 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ముసిని వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 4వ తేదీన జిల్లాలో మొదటి విడతగా 32 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. గద్వాల మండలంలో – 18, గట్టులో- 5, కేటిదొడ్డి – 9, మొత్తం 32 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మిగిలిన 32 కేంద్రాలను ఏప్రిల్ 10న రైతులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో – 43, పిఏసియస్ ఆధ్వర్యంలో – 21 కేంద్రాల ద్వారా యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా సేకరించడం జరుగుతుందన్నారు. ఐకేపీ, పిఏసియస్ ధాన్యం కొనుగోలు నిర్వాహకులకు కలెక్టర్ కార్యాలయంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో వరి ఎ – గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ .2203/- సాధారణ రకానికి క్వింటాలుకు రూ.2183/- రూపాయల మద్దతు ధర చెల్లించడం జరుగుతుందన్నారు. మద్దతు ధర లభించాలంటే రైతులు తప్పనిసరిగా ధాన్యాన్ని ఆరబెట్టి తేమ శాతం 17 కు తక్కువ ఉండేటట్లు చూసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తప్పకుండా తమ వెంట బ్యాంకు పాస్ బుక్, ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ తీసుకురావాలన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుండి అక్రమంగా ధాన్యం తరలిరాకుండా నందిన్నే, ఇర్కిచెడ్, బల్గెర , ర్యాలంపాడు, సుంకేసుల, పుల్లూరు, బైరాపురంల వద్ద ఏడు తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అయన తెలియజేశారు.