అన్నదాతలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద
అక్షర విజేత, కుత్బుల్లాపూర్ :- ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో అవస్థలు పడుతున్న రైతన్నలను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ని సచివాలయంలోని వారి చాంబర్లో కలిసి బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని పంటలను రూ.ఐదు వందలు బోనస్తో కొనుగోలు చేయాలని సీఎస్కు బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన రైతులకు రూ.25 వేలు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.సీఎస్ను కలిసిన వారిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేపీ.వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనా చారి, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు పలువురు నాయకులు తదితరులు పలుకొన్నారు