కాలం చెల్లిన ఇంజక్షన్ ఇవ్వడంతో బాలుడు మృతి
నగరంలో లో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
హాస్పిటల్ యజమాన్యంపై పీఎస్ లో ఫిర్యాదు
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి : కాలం చెల్లిన ఇంజెక్షన్ ఇవ్వడంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన నగరంలో లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ ఒకటో టౌన్ పోలీసులకు బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ధర్పల్లి మండలానికి చెందిన పది నెలల బాలుడు గత నెలలో అస్వస్థతకు గురి కాగా. నగరంలో ఖలీల్ వాడి ఓ చిన్న పిల్లల ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అయిదు రోజులు వైద్యం తర్వాత బాలుడి ఆరోగ్యం మెరుగైంది. తీరా డిశ్చార్జి చేసే సమయంలో మిడజోలం 10 ఎంజీ ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత బాలుడు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించాలని సదరు ఆస్పత్రి వైద్యుడు సూచించాడు. హైదరాబాద్ కు తరలించే సమయంలో బాలుడు మృతి చెందాడు. తీరా కుటుంబీకులకు అనుమానం వచ్చి ఇంజక్షన్ గురించి ఆరా తీయగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే గడువు ముగిసినట్లు గుర్తించారు. అనంతరం ఈ విషయమై కలెక్టర్ తో పాటు ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి యాజమాన్యం తమకు తప్పుడు బిల్లుల వివరాలు ఇచ్చిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.గతంలో సైతం చిన్న పిల్లలు అనారోగ్య బారిన పడి ఈ ఆస్పత్రి కి వస్తే నేడు, రేపు అంటూ నెలల తరబడి వ్యాధి బారిన పడిన చిన్న పిల్లలును డిశ్చార్జ్ చేయకుండా లక్షల రూపాయలు దండుకున్నా సంఘటనలు ఉన్నాయి. కాలం చెల్లిన ఇంజక్షన్లు, మందులు ఇవ్వడం వల్ల ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని సాధారణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్పందించి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.